సివిల్స్.. గ్రూప్స్ లక్ష్యంగా ముందడుగు వేయాలి.
విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్.
నల్గొండ: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో సన్నద్ధం కావాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నాగార్జున ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థి చోల్లేటి ప్రభాకర్ సూచించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్, పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
సివిల్ సర్వీసెస్, గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలను ప్రభాకర్ వివరించారు. ప్రస్తుత పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను వివరిస్తూ.. 2013 తర్వాత సీ-షాట్ (CSAT) విధానం, దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రశ్నల సరళిని అర్థం చేసుకుని, సమయపాలనతో నిరంతరం సాధన చేస్తే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
డిగ్రీతో ఆగిపోవద్దు..
విద్యార్థులు కేవలం డిగ్రీ చదువుకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత అవకాశాలను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం, ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంచుకోవడం, గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం పోటీ పరీక్షల సన్నద్ధతలో కీలకమని చెప్పారు.
కెరీర్ మార్గదర్శకత్వం కీలకం.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ.. విద్యాబోధనతో పాటు విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడం కళాశాల బాధ్యతలో భాగమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి చోల్లేటి ప్రభాకర్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చరిత్ర విభాగం హెచ్ఓడీ డా. బట్టు కిరీటం, అధ్యాపకులు నర్సింగ్ కోటయ్య, హబీబ్, జాజుల దినేష్, నాగరాజు కదిరే, అంకూస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై పోటీ పరీక్షలకు సంబంధించిన తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి