అధిష్టానం నిర్ణయంపై కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం.. ‘ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా తొలగించారు’.
హైదరాబాద్: తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నేరుగా బర్తరఫ్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరి వేస్తున్నామని చెబుతారు.. చివరిగా ఏమైనా కోరిక ఉందా అని అడుగుతారు. కానీ నాకు మాత్రం ఒక్కమాట కూడా చెప్పకుండా పదవి నుంచి తొలగించారు’’ అని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిరెడ్డి తదితరులు కక్ష సాధింపు, కుట్రతో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు.
తన కుమార్తెకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నా కూతురు మాట్లాడితే నన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? నాకు చెప్పాపెట్టకుండా నన్ను తీసేస్తారా?’’ అని ప్రశ్నించారు. సుమంత్ వ్యవహారంలోనూ కుట్ర జరిగిందని, ఆయన పేరుతో నేరాలు, సెటిల్మెంట్లు చేశారంటూ కావాలనే తన కుటుంబాన్ని బద్నాం చేశారని ఆరోపించారు. సుమంత్ కేసును సీసీఎస్కు బదిలీ చేసి టార్గెట్ చేసి వేధిస్తున్నారని అన్నారు.
తనను బర్తరఫ్ చేయించడంలో కొందరు కాంగ్రెస్ నేతల పాత్ర ఉందని ఆరోపించిన సురేఖ.. మల్లు రవిని ఉద్దేశించి కూడా ప్రశ్నలు సంధించారు. గతంలో పార్టీపై విమర్శలు చేసిన పలువురు నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. మాజీ సీఎం రోశయ్య ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు.
‘‘ప్రజల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం.. ప్రజలకే మేం జవాబుదారీ’’ అని సురేఖ అన్నారు. కడియం శ్రీహరి తనపై మాట్లాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు బయటకు వచ్చి తమ గళం వినిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై నోరు విప్పాలని, లేకపోతే భవిష్యత్లో నష్టం తప్పదని హెచ్చరించారు.బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్రెడ్డిపై సురేఖ విమర్శలు చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్లు మేమే చేశామని చెబుతున్న సీఎం.. ఒక బీసీ మహిళా మంత్రి పదవిని ఎలా తొలగించారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తన వ్యవహారశైలిని మార్చుకోవాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మోనోపోలీ తరహా వ్యవహారం సరికాదని, ‘‘నేను పదేళ్లు సీఎంగా ఉంటా’’ అని ఎవరికి వారు ప్రకటించుకోవడం, ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం కూడా సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. తన బర్తరఫ్కు దారితీసిన పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనపై జరిగిన పరిణామాలకు సంబంధించిన పలు అంశాలను ఆ లేఖలో పేర్కొన్నట్లు ఆమె వివరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి