ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య
Editor Desk
భువనగిరి: మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రపంచ మేధావి, విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని నమ్మిన మహనీయుడని పేర్కొన్నారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేతో కలిసి బాలికల విద్యకు శ్రీకారం చుట్టి దేశంలో తొలి ఉపాధ్యాయులుగా నిలిచారని తెలిపారు. సమానత్వం, మహిళా సాధికారత, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పూలే మహిళల అభివృద్ధికి పునాది వేశారని, వారి ఆశయాలను అనుసరించి ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పూలే ఆశయమని, ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం మహనీయులను స్మరిస్తూ ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి సాహితి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి