ఫీజు బకాయిల విడుదలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు
ఫీజు బకాయిల విడుదలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు
Editor Desk
విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హైకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుంచి నిర్బంధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల పేద విద్యార్థులపై భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలు, ఇప్పుడు కొత్త నిబంధనల పేరిట అదనపు ఫీజులు వసూలు చేయడం తగదన్నారు.
ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీని ప్రభావంతో కొంతమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల ముందు మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి