పెండింగ్ కూలి డబ్బులు వెంటనే చెల్లించాలి – 23న ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
పెండింగ్ కూలి డబ్బులు వెంటనే చెల్లించాలి – 23న ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్గొండ మండలంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు నెలలుగా బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఎంపీడీవో కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామాల కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు కూలీలు గత జనవరి నుంచి పనిచేసినా ఇప్పటివరకు తమకు రావలసిన కూలి డబ్బులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులు, కుటుంబ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ, గతంలో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పనిలేని కాలంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు వంద రోజుల పని హామీ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారం లభించిందని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ పథకం అమలు దెబ్బతింటోందని ఆమె ఆరోపించారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూర్చగా, ఇప్పుడు నిధుల పంపకం విధానం మారడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని తెలిపారు. దీంతో పథకానికి తగిన నిధులు అందక పనులు సాగడంలో అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. జనవరి నుంచి కూలీలు పనిచేస్తున్నప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని సరోజ మండిపడ్డారు. కూలీల కష్టాన్ని గుర్తించి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఈనెల 23న నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు నిర్వహించనున్న ధర్నాలో అన్ని గ్రామాల ఉపాధి హామీ కూలీలు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన ద్వారా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి సమస్యకు పరిష్కారం సాధించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గోలి నరసింహ, చింత లింగయ్య, మేడ గోపాల్, మేక మల్లమ్మ, ఎల్లమ్మ, పిట్టల వెంకటమ్మ, పల్లెబోయిన జయమ్మ, మంగమ్మ, గండమల్ల రాములు, చింత ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలకు బకాయి చెల్లింపుల సమస్య తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ఈ ధర్నా కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. కూలీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి