పానగల్ బైపాస్పై లారీని ఢీకొన్న కారు సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం..
పానగల్ బైపాస్పై లారీని ఢీకొన్న కారు సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం..
NM Yadav
నల్లగొండ : నిశ్శబ్దంగా ఉన్న ఆ తెల్లవారుజామున పానగల్ ఫ్లైఓవర్పై మృత్యువు మాటువేసింది. కన్నవారిని చూసి, సొంతూరి జ్ఞాపకాలను మూటగట్టుకుని విధుల్లో చేరేందుకు వెళ్తున్న ఆ యువకుడిని విధి వంచించింది. నిలిపి ఉంచిన లారీ రూపంలో మృత్యువు కబళించడంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. నల్లగొండ పట్టణ శివారులోని పానగల్ బైపాస్ ఫ్లైఓవర్పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి సందీప్ (25) అక్కడికక్కడే మృతి చెందారు.పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి సందీప్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సెలవు ముగించుకుని తన కారులో స్వగ్రామం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. తెల్లవారుజామున నల్లగొండ సమీపంలోని పానగల్ ఫ్లైఓవర్పైకి రాగానే అక్కడ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని సందీప్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అత్యంత వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టిన ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యి లారీ కిందకు దూసుకుపోయింది. ఈ భీభత్సమైన ప్రమాదంలో సందీప్ శరీరానికి తీవ్ర గాయాలై కారు లోపలే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న వెంటనే నల్లగొండ టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు, ఎస్ఐ సైదులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారు భాగాలను కట్ చేసి లోపల ఇరుక్కుపోయిన సందీప్ మృతదేహాన్ని అతికష్టంపై వెలికితీశారు. ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్పై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పోలీసులు సందీప్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందిన కొడుకు విగతజీవిగా పడి ఉన్నాడన్న వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి