నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వెల్నెస్ సెంటర్లో అక్రమాల పర్వం..
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వెల్నెస్ సెంటర్లో అక్రమాల పర్వం..
NM Yadav
ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్డగోలు నియామకాలు!కలెక్టర్ పేరు చెప్పి అధికారుల మాయాజాలం..
నిబంధనలకు పాతర.. నచ్చిన వారిని ఎంపిక..
నల్గొండ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెల్నెస్ సెంటర్లో నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పారదర్శకతకు పాతర వేస్తూ, నిబంధనలను తుంగలో తొక్కి తమకు నచ్చిన వారిని దొడ్డి దారిలో చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిపాలన అధికారి ఆదేశాలంటూ అధికారులు చెప్తున్న మాటలు విస్మయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వ నియామకానికైనా పత్రికా ప్రకటన, మెరిట్ లిస్ట్ విడుదల, కమిటీ ఆమోదం వంటివి తప్పనిసరి. కానీ వెల్నెస్ సెంటర్లో ఇద్దరు ఫార్మసిస్టులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్ల ఎంపికలో ఈ ప్రాసెస్ ఏదీ కనిపించడం లేదు. సోమవారం ‘ప్రజావాణి’లో జిల్లా అధికారికి విన్నవించుకున్న బాధితులనే ఎంపిక చేస్తున్నామని అధికారులు పైకి చెబుతున్నా తెర వెనుక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది.
అక్రమాల చిట్టా పాత వారికే పట్టం..
గతంలో వెల్నెస్ సెంటర్లో పనితీరు బాగోలేదని తొలగించిన ఓ ఫార్మసిస్ట్ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు.గతంలో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) తప్పుకోగా ఆ స్థానంలో అర్హతలతో సంబంధం లేకుండా ఒక అటెండర్ను డీఈఓగా ఎంపిక చేయడం గమనార్హం. 'తోటమాలి' పోస్టుల పేరుతో మరో ఇద్దరిని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు వివరణ ఏంటంటే?..ఈ వివాదంపై అధికారులు స్పందిస్తూ.. కలెక్టర్ మౌఖిక ఆదేశాల ప్రకారమే తాము నియామకాలు చేపడుతున్నామని బుకాయిస్తున్నారు. అయితే లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా నియామకాలు ఎలా చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనంతో నడిచే వ్యవస్థలో ఇలాంటి అడ్డగోలు నియామకాలు ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి