మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ
మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ
Editor Desk
పర్వతగిరి మండలం దేవుని అన్నారంలో ఈనెల 13, 14 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కూలీల రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని మహిళా కూలీల జిల్లా కన్వీనర్ రాచకొండ రాములమ్మ పిలుపునిచ్చారు.
ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ మహిళా కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 80 శాతం కంటే ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నప్పటికీ, కొత్త నిబంధనలతో వారికి ఉపాధి దొరకడం కష్టమైందన్నారు.
ఈ-కేవైసీ, రోజుకు రెండు సార్లు ఫోటోలు వంటి నిబంధనల కారణంగా మహిళా కూలీలు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి పనికి వెళ్లినా, సాంకేతిక సమస్యలతో తిరిగి ఇంటికి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రోజు కూలి కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు.
పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పలువురు మహిళలు వడదెబ్బలకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు భూమిలేని పేద మహిళలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు.
రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి