పట్టుదలతో పీహెచ్డీ సాధించిన బొజ్జ ఆనంద్.
నల్లగొండ: పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు కేశరాజుపల్లికి చెందిన బొజ్జ ఆనంద్. వ్యవసాయ కుటుంబంలో పుట్టి కూలీ పనులు చేస్తూనే చదువును కొనసాగించిన ఆయన.. ఎన్నో కష్టనష్టాలను అధిగమించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆనంద్ ప్రస్థానం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
కేశరాజుపల్లికి చెందిన రైతు కుటుంబం బొజ్జ వెంకటయ్య, పుష్పమ్మ దంపతుల రెండో కుమారుడు ఆనంద్. గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. అనంతరం నల్లగొండలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వెళ్లారు. అద్దె గదిలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువుపై మక్కువతో ముందుకు సాగారు. లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు వదలని పట్టుదలతో పీహెచ్డీ పూర్తి చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా, వైస్చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలగరం, ముఖ్య అతిథి భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా చేతుల మీదుగా ఆనంద్ పీహెచ్డీ పట్టాను అందుకున్నారు.
ఫ్లోరైడ్పై పరిశోధన
ఉస్మానియా విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ గుండా ప్రభాకర్ పర్యవేక్షణలో కనగల్లు, గుర్రంపోడు మండలాల్లో హైడ్రోజియాలాజికల్, జియోకెమికల్ అంశాలపై ఆనంద్ పరిశోధన చేశారు. ఆయా ప్రాంతాల్లోని పొటెన్షియల్ జోన్లలో ఫ్లోరైడ్, నైట్రేట్, సోడియం స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వాటి నివారణకు అవసరమైన చర్యలను సూచిస్తూ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి థీసిస్ను సమర్పించారు.
ప్రస్తుతం ఆనంద్ నల్లగొండ మైనింగ్ జియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. డాక్టరేట్ సాధించిన సందర్భంగా తల్లిదండ్రులు, అన్న అనిల్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధనకు మార్గనిర్దేశం చేసిన ప్రొఫెసర్ గుండా ప్రభాకర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ విజయంపై ఆయనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి