ఖాజిరామారం దళిత సర్పంచ్కు అవమానం?
ఖాజిరామారం దళిత సర్పంచ్కు అవమానం?
NM Yadav
ఖాజీరామారంలో అధికారుల అత్యుత్సాహం..
కాంగ్రెస్ నేతల తీరుపై దళిత సంఘాల ఆగ్రహం..
నల్గొండ : నల్గొండ నియోజకవర్గం లోని ఖాజీరామారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వివాదానికి దారితీసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ ప్రథమ పౌరుడు, దళిత సామాజికవర్గానికి చెందిన సర్పంచ్ సల్వాది సైదులును విస్మరించి కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ రైతు ఉత్పత్తి మార్కెటింగ్ సేవల పరస్పర సహాయక సహకార సంఘం (మాక్స్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబాలు ప్రారంభించారు.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సర్పంచ్కు ఆహ్వానం పలకాల్సి ఉండగా అధికారులు మరియు సొసైటీ సభ్యులు ప్రొటోకాల్ను పూర్తిగా తుంగలో తొక్కారు. కేవలం తమ పార్టీ నేతలతో కలిసి మార్కెట్ చైర్మన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించడంపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక దళిత సర్పంచ్ను పక్కనపెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని బాధితుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినట్లుగా ఉందని, ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొటోకాల్ పాటించని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ అభివృద్ధిలో కీలకంగా ఉండాల్సిన సర్పంచ్కు గౌరవం ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి