కాలేశ్వరం పై హైకోర్టు తీర్పు… కాంగ్రెస్కు చెంపపెట్టు: చిరుమర్తి లింగయ్య
కాలేశ్వరం పై హైకోర్టు తీర్పు… కాంగ్రెస్కు చెంపపెట్టు: చిరుమర్తి లింగయ్య
Editor Desk
నకిరేకల్ నియోజకవర్గంలోని సువర్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్లుగానో చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పుతో తుదిపుల్ల పడిందని స్పష్టం చేశారు.
కాలేశ్వరాన్ని ‘కూలేశ్వరం’గా అభివర్ణిస్తూ అబద్ధపు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు హైకోర్టు గట్టి సమాధానం చెప్పిందన్నారు. “కూలింది కాలేశ్వరం కాదు… కూలింది కాంగ్రెస్ అబద్ధాల కోట” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పీసీ ఘోష్ కమిషన్ పేరుతో వచ్చిన నివేదిక అసలు పీసీసీ నివేదికేనని తాము మొదటి నుంచే చెబుతున్నామని, హైకోర్టు తీర్పు తమ వాదనలకు మద్దతుగా నిలిచిందన్నారు. తెలంగాణ సాగునీటి వ్యవస్థపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు.
“ఇది ముమ్మాటికి తెలంగాణ రైతాంగం విజయం” అని పేర్కొంటూ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నది ఉన్నంత కాలం కాలేశ్వరం ప్రాజెక్టు కొనసాగుతుందని, ఆ ప్రాజెక్టును నిర్మించిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. “పార్టీలపై కోపం ఉంటే విచారణలు చేయండి… కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు” అని హెచ్చరించారు.
అలాగే బీజేపీ, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా లింగయ్య విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తూ స్పందించిన వారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
చివరిగా, “చిల్లర ప్రచారాలు మానేసి… వెంటనే మరమ్మతులు పూర్తి చేసి వాటర్ లిఫ్టింగ్ ప్రారంభించాలి. యాక్టింగ్ చాలించింది… పని మొదలు పెట్టాలి” అని ప్రభుత్వానికి కఠిన సందేశం ఇచ్చారు.
“మాకు ప్రతిపక్ష హోదా కాదు… అధికార పక్ష హోదానే వస్తుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి