జీపీఓలకు మొబైల్ యాప్లు
జీపీఓలకు మొబైల్ యాప్లు
స్థానికం బృందం
పౌరసేవల విచారణ ఇక కాగితరహితం
పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గ్రామ పాలనాధికారులు (జీపీఓ) కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ నుంచి విచారణ, నివేదికల సమర్పణ వరకూ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే కొనసాగనుంది.
రెవెన్యూ సిబ్బంది స్థల పరిశీలన వివరాలు, సిఫారసులు, నివేదికలు నేరుగా యాప్లో నమోదు చేయడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. కాగిత వినియోగం పూర్తిగా తగ్గించి, డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత కొంతకాలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను అమలు చేశారు. యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు సమీక్షించి, సాంకేతికంగా తలెత్తిన సమస్యలను గుర్తించి సవరణలు చేపట్టారు. అన్ని అడ్డంకులు అధిగమించిన తర్వాత పూర్తి స్థాయి అప్లికేషన్ను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జీపీఓలకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా జీపీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్, కలెక్టరేట్ పరిపాలనాధికారి (మీసేవ) సాయి కుమార్, ఈ–జిల్లా మేనేజర్తో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి