హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు
Editor Desk
భువనగిరి,: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోందని తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు ఆరోపించారు.
సిఐటియు ఆధ్వర్యంలో శనివారం భువనగిరి మండలంలోని వీరవల్లి, చందపట్ల, ముస్తాల, పెళ్లిచీమల కొండూరు గ్రామాల్లో హమాలి కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ ఐకెపి సెంటర్లలో పనిచేస్తున్న గ్రామీణ హమాలి కార్మికులకు ధరలకు అనుగుణంగా పారితోషికాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా అదే కేంద్రాల్లో పని చేస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. తాగునీరు, విశ్రాంతి వసతులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కార్మిక చట్టాలు అమలు చేయకుండా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు హమాలి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని విస్మరించిందని విమర్శించారు.
హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రేట్లు పెంచడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నరసింహ, ఐలయ్య, బాల మల్లయ్య, చంద్రయ్య, ఎలేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి