గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం..
గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం..
NM Yadav
కారు-బైక్ ఢీ.. ముగ్గురు మృతి..
నల్లగొండ నుంచి దేవరకొండ వెళ్తుండగా వద్దిరెడ్డిగూడెం వద్ద ఘటన..
అతివేగం, నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక నిర్ధారణ..
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..
గుర్రంపోడు : మండల పరిధిలోని వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులతో పాటు కారులోని ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. అలుగుబెల్లి జైపాల్ రెడ్డికి చెందిన కియా సెల్టోస్ కారులో మరెడ్డి బాల్ రెడ్డి, మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల కలిసి నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి దేవరకొండ వైపు వెళ్తున్నారు. సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారుకు చేరుకోగానే కారు డ్రైవర్ జైపాల్ రెడ్డి వాహనాన్ని అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న స్ప్లెండర్ మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు.
సంఘటనా స్థలంలోనే మృతి..
ఈ ప్రమాద తీవ్రతకు బైక్పై ప్రయాణిస్తున్న నర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న మరెడ్డి బాల్ రెడ్డి కూడా తీవ్రంగా దెబ్బలు తగలడంతో తుదిశ్వాస విడిచారు. కారులోని మిగిలిన ముగ్గురు మహిళలు మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజులలకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్.ఐ వెంకన్నకు సూచించారు. జైపాల్ రెడ్డి అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ అనర్థం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి