విద్యతోనే ఏదైనా సాధ్యం – అంబేడ్కర్ అందరివాడు: మంత్రి వివేక్ వెంకటస్వామి
విద్యతోనే ఏదైనా సాధ్యం – అంబేడ్కర్ అందరివాడు: మంత్రి వివేక్ వెంకటస్వామి
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్/జహీరాబాద్: క్రమశిక్షణ, పట్టుదల, విద్య ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామం, మొగుడంపల్లి మండలంలోని గోపనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాలను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంబేడ్కర్కు ఎదురైన వివక్ష ఆయనను వెనక్కి తిప్పలేదని, విద్య ద్వారా దేశ రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారని చెప్పారు. సమాజంలో వివక్ష, అంటరానితనాన్ని దూరం చేసేది విద్య మాత్రమేనని, యువత అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. మహిళల హక్కులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు.
ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు రాజ్యాంగ పరిరక్షణలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రి వివేక్ పాత్ర కీలకమని గుర్తు చేశారు.
రామతీర్థం–హద్నూర్ రహదారి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఎంపీ నిధులతో గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను పక్కన పెడితే జహీరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు.
కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, మహ్మద్ తన్వీర్, యూనుస్, భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నర్సింహులు, పార్టీ నాయకులు, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి