చర్చలతోనే సమస్యల పరిష్కారం ఆత్మహత్యలు వద్దు..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
చర్చలతోనే సమస్యల పరిష్కారం ఆత్మహత్యలు వద్దు..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NM Yadav
రైతు బంధు, బోనస్లలో ఏదో ఒకటి అమలు చేస్తే మేలు..
నల్గొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని కార్మికులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. సమ్మె విరమించే దిశగా అడుగులు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రైతుల సంక్షేమంపై కీలక సూచనలు..
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నప్పటికీ, ఈసారి 'తాలు' సమస్య రైతులకు ఇబ్బందిగా మారిందని గుత్తా పేర్కొన్నారు. విత్తన లోపాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారని, అకాల వర్షాల ముప్పు ఉన్నందున ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. రైతు బంధు, సన్న వడ్లకు బోనస్ అంశాలపై ఆయన స్పందిస్తూ..రెండు పథకాలు ఒకేసారి అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. రైతు బంధు లేదా బోనస్.. ఈ రెండింటిలో రైతులకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ప్రభుత్వం ఆలోచించి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుంది.అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనకపోవడంతో అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారని ఇది స్థానిక రైతులకు నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికి సహకరించడం లేదని విమర్శించారు. వాస్తవాలను విస్మరించి ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
కోర్టు తీర్పులపై స్పష్టత..
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని గుత్తా స్పష్టం చేశారు. కేవలం సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వని కారణంగా కేసీఆర్, హరీష్ రావులపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు పేర్కొందని వివరించారు. రాజకీయాల్లో యువతకు అవకాశాలు పెరగాలని ఆకాంక్షించిన ఆయన, భవిష్యత్తులో తాను పోటీ చేసే విషయంపై అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి