భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన
భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన
Editor Desk
భువనగిరి: పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల సమస్య తీవ్రంగా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆరోపించింది. ఈ మేరకు పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఓటు హక్కును కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం, వేరే ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ కూడా ఓటు కొనసాగించడం, అధికారులపై ఒత్తిడి తెచ్చి పేర్లు జాబితాలో ఉంచించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
ఇలాంటి దొంగ ఓట్ల ఆధారంగా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని కాన్షీరామ్ పేర్కొన్నారు. పేదల ఓటును దోచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే రాజకీయాలకు భువనగిరి ప్రజలు మద్దతు ఇవ్వబోరని స్పష్టం చేశారు.
అందువల్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃసమీక్షించి, డబుల్ ఓట్లు, దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే భారీ స్థాయిలో ఫిర్యాదులు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నిజాయితీ ఓటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, దొంగ ఓట్లతో వచ్చిన అధికారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కాన్షీరామ్ అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి