బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్పై మండిపడ్డ కమలం నేతలు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించిన చిట్యాల బీజేపీ నాయకత్వం.
చిట్యాల: నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా. వర్శిత్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లితో సహా కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.
దాడికి గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం నల్గొండకు వెళ్తున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం దారుణమన్నారు.
‘దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి’
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయనడానికి ఈ ఘటన నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చిట్యాల బీజేపీ మండల, పట్టణ శాఖలు డిమాండ్ చేశాయి.
ముందస్తు అరెస్టుల్లో పలువురు బీజేపీ నేతలు.
ముందస్తు అరెస్టైన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు పీకే వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్గౌడ్, సీనియర్ నాయకులు అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మండల నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యుడు విష్ణు, సీనియర్ నాయకుడు కంచర్ల శంకర్రెడ్డి, పట్టణ నాయకులు వైరాల రాహుల్, పిల్లి రవి తదితరులు ఉన్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి