హైదరాబాద్ రోడ్షోలో కేంద్రం పిలుపు.
హైదరాబాద్, ఆగస్టు 31 స్థానికం ప్రతినిధి :
కాలుష్య రహిత ఇంధన రంగంలో కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ‘భారత పునరుత్పాదక ఇంధన సదస్సు–ఎక్స్పో (బీఆర్ఈ సమ్మిట్–2026)’లో భాగంగా సోమవారం హైదరాబాద్లో రోడ్షో నిర్వహించారు.జైపూర్, ముంబయి తర్వాత మూడో రోడ్షోగా హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనుపమ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 300 గిగావాట్లను దాటిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. పునరుత్పాదక విద్యుత్తో పాటు ఇంధన నిల్వ, గ్రీన్ హైడ్రోజన్, తయారీ, ప్రసార వ్యవస్థ, డిజిటల్ సాంకేతికతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో పరిశుద్ధ, హరిత ఇంధన విధానం–2025 ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పరిశుద్ధ ఇంధన తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు టీజీరెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించేందుకు లక్ష్యంగా పెట్టుకుందని ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ కమలాకర్ బాబు తెలిపారు. తమిళనాడు పవన, సౌర విద్యుత్ రంగాల్లో ముందంజలో ఉందని ఆ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ డైరెక్టర్ బి.రాజేశ్వరి పేర్కొన్నారు.నవంబర్ 2 నుంచి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో బీఆర్ఈ సమ్మిట్–2026 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ద్వారా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి