అసీఫ్ నహర్ కాల్వ సమస్యల పరిష్కారానికి చర్యలు కోరుతూ వినతి
అసీఫ్ నహర్ కాల్వ సమస్యల పరిష్కారానికి చర్యలు కోరుతూ వినతి
Editor Desk
మునిపంపుల గ్రామ పరిధిలోని అసీఫ్ నహర్ కాల్వలో నీటిని తాత్కాలికంగా నిలిపివేసి విస్తృతంగా పెరిగిన గుర్రపుడెక్క ఆకును తొలగించాలని, అలాగే శిధిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన కాల్వ కట్టను తక్షణమే మరమ్మత్తు చేయాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు.
గ్రామ రైతులతో కలిసి చిట్యాల నీటిపారుదల డిఇ కార్యాలయంలో సెక్షన్ అధికారి శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా కాల్వ నిరాటంకంగా ప్రవహిస్తుండడంతో గుర్రపుడెక్క ఆకు విస్తృతంగా పెరిగి కాల్వను పూర్తిగా ఆవరించి ప్రమాదకరంగా మారిందన్నారు.
అధిక ప్రవాహం సమయంలో నీరు కట్ట మించి వెళ్లడంతో పలుసార్లు కట్టలు తెగిన ఘటనలు జరిగాయని, దీనివల్ల తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. కాల్వ కట్ట కింద ఉన్న పొలాలు దెబ్బతిని రైతులు కోత కూడా కోయలేని పరిస్థితి ఏర్పడిందని, పైభాగంలోని పొలాలు నీటిలో మునిగి సాగుకు అనుకూలంగా లేకుండా పోయాయని వాపోయారు.
కట్టపై చెట్లు, కంపలు పెరిగి అడ్డంగా పడిపోయి ఉన్నాయని, పర్యవేక్షణ లోపించిందని అన్నారు. దశాబ్ద కాలంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఒక నెలపాటు నీటి ప్రవాహాన్ని తగ్గించి గుర్రపుడెక్క ఆకును తొలగించి, కాల్వ కట్టను బలపర్చాలని కోరారు.
అలాగే అసీఫ్ నహర్ కాల్వకు నీటి విడుదలపై వార్షిక సమయ ప్రణాళిక ప్రకటించాలని, తద్వారా రైతులు ఒకేసారి పంటలు వేయడానికి సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ విషయమై నీటిపారుదల డిఇ సునీత నందను సంప్రదించగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, మాజీ ఉపసర్పంచ్ మామిడి పాండు రెడ్డి, రైతులు మన్నెం పద్మారెడ్డి, కల్లూరి రవికుమార్, మేకల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి