ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం
Editor Desk
ఎర్రుపాలెం, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు వద్ద సీపీఎం పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని, ఇప్పటివరకు ప్రతి మహిళకు సుమారు రూ.60,000 బకాయి పడిందని తెలిపారు.
పెన్షన్ల పెంపుపై కూడా ప్రభుత్వం వెనుకడుగు వేసిందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం రూ.2,000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ హామీ కూడా అమలు కాలేదని తెలిపారు.
రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, రూ.2 లక్షల రుణమాఫీ వంటి కీలక హామీలకు బడ్జెట్లో ప్రస్తావన లేదని పేర్కొన్నారు. విద్యాభరోసా, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలను విస్మరించిందని ఆరోపించారు.
ఉపాధి హామీ కూలీలు, ఆటో డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సాయం, పెళ్లిళ్లకు బంగారం వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రచారం ఎక్కువగా చేసి అమలు తక్కువగా ఉన్న పాలన కొనసాగుతోందని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధులు కేటాయించి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కోటి సుబ్బారెడ్డి, దూదిగం బాసవయ్య, గామసు జోగయ్య, దివ్వెల వీరాంజనేయులు, సగ్గుర్తి వెంకటకృష్ణ, నక్క పుల్లారావు, షేక్ మస్తాన్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి