ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు – హామీలు అమలు చేయాలని డిమాండ్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు – హామీలు అమలు చేయాలని డిమాండ్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేకసార్లు యాజమాన్యానికి వినతిపత్రాలు అందజేసి, నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా సమంజసమైనవేనని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని సత్తయ్య అన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని ఆయన కోరారు.
ఇక 2017 సంవత్సరం నుంచి బకాయి ఉన్న ఏరియర్లను వెంటనే చెల్లించడంతో పాటు పిఆర్సీ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని తెలిపారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సత్తయ్య గుర్తుచేశారు. కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కాదని, కనీస హక్కులు మరియు సౌకర్యాలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం ప్రతి కార్మికుడి హక్కు అని, ఆర్టీసీలో యూనియన్లకు అనుమతి ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, అద్దంకి నర్సింహ, ఊట్కూర్ మధుసూదన్ రెడ్డి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి