అమెరికా యుద్ధోన్మాదంపై నోరు విప్పాలి: సీపీఎం
అమెరికా యుద్ధోన్మాదంపై నోరు విప్పాలి: సీపీఎం
స్థానికం బృందం
రామన్నపేట: ఇరాన్పై ఇజ్రాయిల్–అమెరికా దాడిని ఖండించకుండా భారత ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య విమర్శించారు. సోమవారం రామన్నపేటలోని సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
అమెరికా ఆయుధ శక్తితో చమురు నిల్వలు ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు చేస్తూ అమాయక ప్రజలను బలితీసుకుంటున్నప్పటికీ భారత ప్రధాని స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోందని తెలిపారు.
ప్రధాని ఇజ్రాయిల్ పర్యటన అనంతరం ఇరాన్పై దాడులు జరగడం ప్రపంచ దేశాల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. అమెరికాతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం ఆందోళనలకు పిలుపునిచ్చిందని, గ్రామీణ ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, ఏభూషి నర్సింహా, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, గన్నేబోయిన విజయభాస్కర్, గొరిగె సోములు, భావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, ఎండీ రషీద్, బోడిగె రజిత, గంటేపాక శివకుమార్, మునికుంట్ల లెనిన్, శానకొండ రామచంద్రం, గుణగంటి మల్లేశం, పల్లె సత్యనారాయణ, జల్లెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి