అద్దంకి బైపాస్లో ఘోర ప్రమాదం – పది గొర్రెల మృతి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్
అద్దంకి బైపాస్లో ఘోర ప్రమాదం – పది గొర్రెల మృతి, బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సీపీఎం డిమాండ్
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ జిల్లా: అద్దంకి బైపాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జీవనాధారాన్ని కోల్పోయిన గొర్రెల కాపరి మన్నె కోటిలింగం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద బండ ప్రాంతం నుండి గొర్రెలను మేపుకుంటూ అద్దంకి బైపాస్ దాటుతున్న సమయంలో, హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే పది గొర్రెలు మృతి చెందగా, మరో ఐదు గొర్రెలు గాయాలపాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సీపీఎం నాయకులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత గొర్రెల కాపరి మన్నె కోటిలింగాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. రోజువారీ జీవనాధారం పూర్తిగా గొర్రెలపైనే ఆధారపడి ఉన్న కోటిలింగం కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, అద్దంకి బైపాస్లో రోడ్డు భద్రతా సదుపాయాలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనాలు అధిక వేగంతో సంచరిస్తుండటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అన్నారు. వెంటనే రోడ్డు భద్రత అధికారులు స్పందించి, అద్దంకి బైపాస్పై రేడియం లైట్లు, హెచ్చరిక సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎఫ్సీఐ పెద్ద బండ ప్రాంతం నుండి వ్యవసాయ పొలాల వైపు వెళ్లే మార్గంలో అండర్పాస్ నిర్మాణం చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. గ్రామీణ ప్రజలు, గొర్రెల కాపరులు రోడ్డు దాటే సమయంలో సురక్షిత మార్గాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు.
ప్రమాదంలో నష్టపోయిన మన్నె కోటిలింగం కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన గొర్రెలకు వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద బండ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు ముక్కముల వెంకన్న, సీపీఎం నాయకులు మన్నె శంకరయ్యతో పాటు రైతులు, గొర్రెల కాపరులు ముక్కముల లింగయ్య, జక్కల కృష్ణ, దొడ్డోని శ్రావణ్, గోగుల మల్లయ్య, కర్నాటి లక్ష్మీనారాయణ, నల్లబోతు రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి