అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప
అంబేద్కర్ జయంతి ర్యాలీ ఘటన – పోలీసులపై ఆరోపణలు అసత్యం: డీఎస్పీ నరసింహప్ప
Prakash
సత్యసాయి జిల్లా, ఏప్రిల్ 15: అంబేద్కర్ జయంతి సందర్భంగా కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో పోలీసులపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పెనుకొండ డీఎస్పీ, ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నరసింహప్ప తెలిపారు.
ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి గ్రామంలోని సున్నిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ర్యాలీ ప్రశాంతంగా సాగేందుకు సీఐ, ఎస్ఐలు మరియు సిబ్బందిని విధుల్లో నియమించామని చెప్పారు.
ఈ క్రమంలో సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన న్యాయవాది కె. చంద్రశేఖర్ రెడ్డి కొంతమందితో కలిసి ర్యాలీకి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఆయన దూకుడుగా ప్రవర్తిస్తూ పోలీసు సిబ్బందిని తోసిపుచ్చడంతో పాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ తోపులాటలో ఆయనకు స్వల్ప గాయం అయినట్లు తెలిపారు.
పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించి, అనంతరం కేసు నమోదు చేసి నోటీసు ఇచ్చి అదే రాత్రి విడుదల చేసినట్లు వివరించారు. ర్యాలీ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.
అయితే అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో “పోలీసులు కొట్టారు, రూ.3 లక్షలు లాక్కొన్నారు” అంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని డీఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి న్యాయవాదుల వర్గాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని అన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ నరసింహప్ప విజ్ఞప్తి చేశారు.
— పెనుకొండ సబ్-డివిజన్ పోలీస్ కార్యాలయం

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి