చెరుకుపల్లి చెరువుకు కేటుగాళ్ల గుంత
చెరుకుపల్లి చెరువుకు కేటుగాళ్ల గుంత
Komidala Mahender reddy
పర్మిషన్ ముసుగులో యదేచ్ఛగా మట్టి దోపిడి.. ఇటుక బట్టీలకు తరలింపు.
అధికారుల కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికుల ఆరోపణ.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామంలో చెరువు మట్టి అక్రమ తవ్వకాలు బహిరంగంగా సాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువు అభివృద్ధి పేరుతో పరిమిత అనుమతులు తీసుకున్న కొందరు వ్యక్తులు, వాటిని అడ్డుపెట్టుకుని అనుమతించిన దానికంటే పలుమార్లు ఎక్కువ లోతులో తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా భారీ టిప్పర్లతో చెరువు మట్టిని తరలిస్తూ సమీప ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు గర్భాన్ని యంత్రాలతో లోతుగా తవ్వడంతో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ మట్టి తరలింపుతో గ్రామీణ రహదారులు దెబ్బతింటుండగా, టిప్పర్ల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. , రైతులు, వృద్ధులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, కొందరు అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతుల నిబంధనలు ఉల్లంఘించి చెరువు సహజ స్వరూపాన్ని మార్చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేసి చెరువులను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పర్యావరణ సమతౌల్యానికి ఆధారమైన చెరువులను అక్రమ మాఫియాల బారిన పడనివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి