ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలి
Vikram
విద్యార్థులకు సాంకేతికతతో కూడిన విద్య అందించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నూతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని, విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. స్థానిక ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని NIEPA సంస్థ నిర్వహించిన “ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎంపవరింగ్ కేజీబీవీ వార్డెన్స్” శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల ఉపాధ్యాయుల్లో నూతన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారిత బోధన అందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండటానికి, ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించడం, వసతి, భోజన సౌకర్యాలతో విద్యార్థులు ఉపాధ్యాయులతో నిరంతరం మమేకం కావడమే కారణమని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో పొందిన పరిజ్ఞానాన్ని తిరిగి పాఠశాలలకు వెళ్లిన తర్వాత తోటి ఉపాధ్యాయులకు కూడా పంచాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు పోటీపడి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో బోధనా సామర్థ్యాన్ని మరింత పెంచాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఉన్నత విద్యకు సిద్ధం చేసి, గ్రూప్స్, మెయిన్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు పోటీపడే స్థాయికి తీసుకువెళ్లేలా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, నోడల్ ఆఫీసర్ పూలన్, మాస్టర్ ట్రైనర్స్ నిర్మల జ్యోతి, తవిటి నాయుడు, సూర్య కళ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి