పెనుకొండ: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రి సవితపై చేస్తున్న ఆరోపణలు ఉనికి కోసం చేస్తున్నవేనని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు కోల్పోయి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో రాజకీయంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి సవిత నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉషశ్రీ చరణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆమె వైఖరిలో మార్పు లేదని విమర్శించారు.
అన్నా క్యాంటీన్ ద్వారా వేలాది పేదలకు ఆహారం అందించిన ఘనత సవితమ్మదేనని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 1000 రోజులకు పైగా సేవలు అందించారని గుర్తుచేశారు. రాంపురం అభివృద్ధి, పేద విద్యార్థులకు ఉచిత విద్య కోసం ఎంజేపై స్కూల్ స్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
మంత్రిగా ఉన్న ఐదేళ్లలో స్పందించని సమస్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా అని ప్రశ్నించిన వెంకటరమణ, పరిగి మండలంలోని ఫ్రీ కాట్ మిల్ మూతపడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయలేని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
వ్యక్తిగత విమర్శలకు దిగితే తామూ స్పందించగలమని, కానీ ఆ స్థాయికి దిగజారడం తమ సంస్కృతి కాదని హెచ్చరించారు. ఇకపై మంత్రి సవితమ్మపై అనవసర వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.
పెనుకొండలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులతోనే ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి