రేవంత్ భూతం రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది: మాజీ మంత్రి జగదీష్రెడ్డి
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమేనని, రేవంత్ అనే భూతం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్లు, అభివృద్ధి కుంటుపడ్డాయని జగదీష్రెడ్డి విమర్శించారు. ప్రజలు ఏ సమస్యను ప్రస్తావించినా కాంగ్రెస్ నాయకులు ఏవేవో సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీటిని అందించే అవకాశం ఉన్నా కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతులు పంటలు వేసుకోవాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్ వైపు తరలిస్తున్నా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఇంతకంటే తక్కువ నీటి లభ్యత ఉన్న సమయంలోనూ పంటలను సమృద్ధిగా పండించామని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబును ఒప్పించి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రైతులు పంటలు పండించకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగదీష్రెడ్డి ఆరోపించారు. పంటలు పండితే నీళ్లు, విద్యుత్, బోనస్లు ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ పాదయాత్ర చేసి రైతుల పంటలను కాపాడారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుల తరఫున ఎలాంటి పోరాటానికైనా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదని మిర్యాలగూడ రైతు ధర్నాలో కేటీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అవసరమైతే మరోసారి పాదయాత్రలు చేపట్టినా రైతుల పంటలు ఎండిపోకుండా పోరాటం చేస్తామని జగదీష్రెడ్డి స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి