ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు
ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు
Komidala Mahender reddy
ఓటీపీ కోసం ఎదురుచూపులు.. ఖాతాల్లోకి రాని ధాన్యం డబ్బులు
ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఇప్పుడు తమ కష్టార్జిత డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 29న పెద్దకాపర్తి PACS కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయినా, ఇప్పటి వరకు ట్రాక్ షీట్ను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వందలాది మంది రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం విక్రయించి పది రోజులకు పైగా గడిచినా చెల్లింపులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వరికోత యంత్రాల యజమానులు, ట్రాక్టర్ నిర్వాహకులు, ఎరువుల దుకాణాల యజమానులు, ధాన్యం ఆరబోసిన కూలీలు, పట్టాలు ఇచ్చిన వారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా చేతికి డబ్బులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చుకోవాలని భావించినా, చెల్లింపుల జాప్యం వారి ఆశలను నీరుగారుస్తోందని పేర్కొంటున్నారు. మరోవైపు తదుపరి పంటల సాగుకు సన్నాహాలు చేయాల్సిన సమయంలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని వాపోతున్నారు.పెద్దకాపర్తి PACS కేంద్రం అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్ షీట్ ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
"పంట పండించడం కంటే అమ్మిన ధాన్యానికి డబ్బులు రావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది" అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తక్షణ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి