గణేష్ మండపాలను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..
డిజేలపై నిషేధం, సీసీ కెమెరాలు తప్పనిసరి..
మైనర్లు చదువు మానొద్దు నిబంధనలు పాటించాల్సిందే..
నల్లగొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. నల్లగొండ పట్టణంలోని కమ్యూనల్ సున్నిత, మిశ్రమ జనాభా కలిగిన ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను బుధవారం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్ క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ జారీ చేసిన కీలక మార్గదర్శకాలు..
ప్రతి గణేష్ మండపం వద్ద నిరంతరం పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా కనిపించేలా చూడడంతో పాటు 24 గంటల పాటు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి. అన్ని మండపాలను ఆన్లైన్లో నమోదు చేసి, జియో టాగింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. విద్యుత్ వైరింగ్, స్విచ్ బోర్డులు, జనరేటర్లను సురక్షితంగా ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. సౌండ్ సిస్టమ్ను నిబంధనలకు లోబడి మాత్రమే వినియోగించాలి. నిర్ణీత సమయం దాటిన తర్వాత మైకులు, డీజేలను పూర్తిగా నిలిపివేయాలి. ఇతర మతాల మనోభావాలు దెబ్బతినేలా పాటలు, నినాదాలకు తావులేకుండా చూడాలి.
చదువులకు ఆటంకం కలిగిస్తే కౌన్సెలింగ్..
పాఠశాలలు, కళాశాలలకు గైర్హాజరై మైనర్ విద్యార్థులు మండపాల వద్ద సమయం వృథా చేయకుండా నిర్వాహకులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. క్లాసులు ఎగొట్టి మండపాల వద్ద కనిపించే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమక్షంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి విద్య ప్రాముఖ్యతను వివరిస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగే సూచనలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని హెచ్చరించారు. పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్, నిఘా కొనసాగుతుందన్నారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, ప్రజలు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ నాగరాజు, 1-టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి