మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..
పట్టణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం..
నల్గొండ : మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నల్గొండ పురపాలక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ పట్టణం 1వ డివిజన్లోని ప్రముఖ పచ్చల సోమేశ్వరాలయం ప్రాంగణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా డిజిటలైజ్ చేసి అందించడం ద్వారా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతోనే ఈ ఆధునిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, దీనివల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా రేషన్ అందుతుందని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతినెల తప్పనిసరిగా రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోవాలని కోరారు.
రూ రూపురేఖలు మారుస్తున్నాం..
రోడ్లు, రింగ్ రోడ్లు, నీటి ట్యాంకులు, అండర్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రసిద్ధ లతీఫ్సాబ్ గుట్టకు ఘాట్ రోడ్డు వంటి పలు బృహత్తర అభివృద్ధి పనులను వేగవంతం చేశామని మేయర్ పేర్కొన్నారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండదండలతో నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పట్టణంలోని 48 డివిజన్ల పరిధిలో మొత్తం 42,855 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, వాటిని ఆయా వార్డుల్లో త్వరలోనే పూర్తిగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పరుశురాములు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, వార్డు ఆఫీసర్ అనిల్ తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి