సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు
సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు
Editor Desk
కోదాడ,
కూచిపూడి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం, సర్పంచ్ భర్త జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ 2వ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
వార్డు సభ్యుడు కటిక గోపాల్రావు సమర్పించిన వినతిపత్రంలో… వార్డులో సీసీ రోడ్డుపై మురికి నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ వర్షాకాల పరిస్థితులు నెలకొని దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించకుండా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వార్డు సభ్యులను బెదిరిస్తున్నారని, సమస్యలు ప్రస్తావిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీ సిబ్బందిని కూడా తన అనుమతి లేకుండా పనులకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.
ఈ అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి