నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో వరుస ఘటనలపై తల్లిదండ్రుల ఆందోళన.
నాగార్జునసాగర్: బీసీ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఆరో తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హాస్టల్లో విద్యార్థుల భద్రత, సిబ్బంది పర్యవేక్షణపై వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండో అంతస్తు నుంచి విద్యార్థి కిందపడే పరిస్థితి ఎలా ఏర్పడిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
గతంలోనూ ఘటనలు..!
2025–26 విద్యా సంవత్సరంలోనూ గురుకులంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆరో తరగతి విద్యార్థి సాత్విక్ యాదవ్ కడుపునొప్పిగా ఉందని సిబ్బంది, ప్రిన్సిపాల్కు తెలిపినా సకాలంలో స్పందించలేదని వారు పేర్కొన్నారు. అనంతరం పేగు సంబంధిత సమస్యతో సాత్విక్ మృతి చెందినట్లు సమాచారం.
అలాగే మరో విద్యార్థి సాయిగణేష్తో బరువైన బల్లలు, ఇతర వస్తువులు ఎత్తించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ విద్యార్థికి ప్రిన్సిపాల్ సొంత ఖర్చులతో చికిత్స చేయించినట్లు సమాచారం.
గత ఘటనలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో గురుకులంలో విద్యార్థుల భద్రతా ప్రమాణాలు, సిబ్బంది పర్యవేక్షణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. వరుస ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి