రైతులకు మార్కెట్ రేటు పరిహారం ఇవ్వాలని సిపిఎం ధర్నా
రైతులకు మార్కెట్ రేటు పరిహారం ఇవ్వాలని సిపిఎం ధర్నా
Editor Desk
భువనగిరి మండల కేంద్రంలో సోమవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్కు సమస్యలపై మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టు కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నడికుడి–బీబీనగర్ రైల్వే రెండో లైన్లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని, రాజకీయ పక్షపాతం లేకుండా అమలు చేయాలని సూచించారు. గత కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బస్వాపురం ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయిస్తే జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగు సాధ్యమవుతుందని తెలిపారు. మండలంలోని లింక్ రోడ్లను పూర్తి చేయాలని, నాగిరెడ్డిపల్లి వద్ద హైవేపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు కాలువలపై రైతుల రాకపోకలకు బ్రిడ్జిలు నిర్మించాలని, గ్రామాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, కోతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. భూ పంపిణీ నిషేధాన్ని ఎత్తివేసి పేదలకు ఇండ్ల స్థలాలు, సాగు భూములు కేటాయించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు దయ్యాల నర్సింహ, పల్లెర్ల అంజయ్య, ఏదునూరి మల్లేశం, కొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి