పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
Editor Desk
నల్గొండ,
రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వేడుక కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్డిలు ముందంజలో ఉంటారని అన్నారు. రెడ్డి వర్గంలో కూడా పేదవారు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉన్నత చదువులకు సొసైటీ నుంచి ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. టెక్నికల్ కోర్సుల్లో అధిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సొసైటీ పదవులు చేపట్టిన వారు బాధ్యతగా పనిచేయాలని, పదవి చిన్నదా పెద్దదా అన్నది కాకుండా నిబద్ధతతో వ్యవహరించాలని అన్నారు.
నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, పేదలకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని మంత్రి తెలిపారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి వర్గంలో అందరూ సంపన్నులు కాదని, పేద విద్యార్థులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మంత్రులు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మూల దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి