పశు సంపద సంరక్షణ అందరి బాధ్యత..
పశు సంపద సంరక్షణ అందరి బాధ్యత..
NM Yadav
పర్యావరణ సమతుల్యతలో మూగజీవాల పాత్ర కీలకం..
మే రెండో వారంలో పెంపుడు కుక్కల దత్తత కార్యక్రమం..జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వెల్లడి
నల్గొండ : నేరుగా ఆదాయాన్ని సృష్టించే పశు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
పశువుల ద్వారా మనుషులతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడగలుగుతామని సమాజ అభివృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మాంసం వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పశుగ్రాసం, పశువుల నాణ్యత (లైవ్ స్టాక్)పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పశు సంతతికి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరుస్తామని పశు వైద్యశాలలు, సబ్ సెంటర్లలో మౌలిక వసతులు, టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా ల్యాబ్లు లేదా ఇతర వసతుల అవసరం ఉంటే తక్షణమే ప్రతిపాదనలు పంపాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ను ఆదేశించారు. జిల్లాలో సుమారు 35 వేలకు పైగా కుక్కల జనాభా ఉందని ప్రస్తుతం ఒకే ఒక ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.
అన్ని మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు స్థలాలను సేకరించాలని ఆర్డీవోలను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే మే రెండో వారంలో జిల్లాలో పెంపుడు కుక్కల దత్తత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పశువుల ఇన్సూరెన్స్పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, విశ్రాంత అధికారి వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల సహాయ సంచాలకులు, పశువైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి