ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు!
ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు!
K.RAVI
ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న జిల్లా అధికారులపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
జిల్లా డీఈఓ పర్యవేక్షణ లేక విద్యా వ్యవస్థ దెబ్బతింటోంది
శిధిల భవనాలకు బదులు కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్
ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ పిలుపు మేరకు చిన్నకొండూరు, పంతంగి, కుంట్లగూడెం, తంగడిపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరిస్థితులపై సర్వే నిర్వహించింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించకుండా ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం దారుణమని తీవ్రంగా విమర్శించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై ఎన్నో రోజులు గడిచినా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించకపోవడం బాధాకరమని అన్నారు. ఇది విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగిన తరగతి గదులు లేకపోవడం, ఉపాధ్యాయుల ఖాళీలు, శిధిలావస్థలో భవనాలు, విద్యార్థులకు యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ఆలోచన సరికాదని, బదులుగా అవసరమైన వసతులు కల్పించి వాటిని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న జిల్లా అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాలశం సృజన, ఇరిగి వరుణ్ తేజ్, చెక్క జయంత్, జస్వంత్, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి