కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజo .
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని లింగయ్య ఆరోపించారు. రెండు టర్మ్లు ఓడిపోయినా సంపాదించలేనంత డబ్బును కొద్ది నెలల్లోనే సంపాదించామని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
నల్గొండ రైతులకు సాగునీరు ఏది?
AMRP ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని లింగయ్య ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆదేశాలకు నల్గొండ జిల్లా ఇరిగేషన్ మంత్రి తలొగ్గుతున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు.
పంట చేతికి వచ్చే కీలక సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి AMRP పరిధిలోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని డిమాండ్ చేశారు.
దళితులపై వేధింపులు ఆపాలి
కాంగ్రెస్ పాలనలో దళితులపై వేధింపులు పెరిగాయని లింగయ్య ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఇప్పలగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు సభ్యులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం షెడ్డు తొలగించారని, దీనిని ప్రశ్నించిన దళితులు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించారని ఆరోపించారు.
పోలీసులు రాజకీయ నాయకుల మెప్పు కోసం కాకుండా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నల్గొండ జిల్లాకు నీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి