మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.. 22న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.. 22న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
రెండు రోజుల నిరసన దీక్షలు ముగింపు.. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమని హెచ్చరిక
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా నిర్వహించిన నిరసన దీక్షలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎం.డి. సలీం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల శ్రమను వినియోగించుకుంటూ కనీస హక్కులను కూడా కల్పించకపోవడం అన్యాయమని విమర్శించారు.
మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి, రెండో పీఆర్సీని అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న 110 మంది డ్రైవర్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, వారికి సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగించడం, పీఎఫ్ సొమ్ములు చెల్లించకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఎం.డి. సలీం స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం చేపట్టే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగుల కరుణ, పందుల లింగయ్య, చిక్కుల్లా రాములు, కత్తుల కృష్ణవేణి, శ్రీదేవి, కత్తుల సుజాత, బుజ్జమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలపడే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి