కలెక్టర్ ఆదేశాలకు నిరాకారం.. హైకోర్టు తీర్పుకు ధిక్కారం..!
కలెక్టర్ ఆదేశాలకు నిరాకారం.. హైకోర్టు తీర్పుకు ధిక్కారం..!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
రైతు భూమిలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు.. అయినా కొనసాగుతున్న పనులపై పోలగోని మల్లయ్య ఆవేదన
కనగల్ మండలానికి చెందిన రైతు పోలగోని మల్లయ్య తన పట్టా భూమిలో జరుగుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు వాటిని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. గౌరవ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నాయని గుర్తుచేస్తూ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి (డీపీఓ) ఆదేశాలు జారీ చేసినా, నేటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కనగల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 637-11/1లో గల ఒక ఎకరం భూమి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని పోలగోని మల్లయ్య తెలిపారు. ఈ భూమికి సంబంధించి 1993లో నమోదైన రిజిస్టర్డ్ సేల్ డీడ్, కొత్త పట్టాదారు పాసుబుక్, ఖాతా నంబర్ 1176 తన పేరుపై ఉన్నాయని పేర్కొన్నారు. గత నలభై సంవత్సరాలుగా తాము ఈ భూమిని అనుభవిస్తూ సాగు చేసుకుంటున్నామని తెలిపారు.
గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తన భూమిలో ఆర్చి నిర్మించడంతో గౌరవ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు మల్లయ్య తెలిపారు. రిట్ పిటిషన్ నంబర్ 30027/2023లో హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలంలోనే మార్కెట్ కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, తన పట్టా భూమిలోకి ప్రవేశించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
అయితే హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి తిరిగి అదే భూమిలో మార్కెట్ కమిటీ అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, హైకోర్టు ఆదేశాలు ఉన్నందున వెంటనే నిర్మాణాలు నిలిపివేయాలని డీపీఓకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థాయిలో ఆ ఆదేశాలు అమలు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
కలెక్టర్ ఆదేశాలు జారీ అయి రోజులు గడుస్తున్నా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు రెండూ ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా ఉండడం పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు.
తనకు జరిగిన ప్రమాదం కారణంగా గత నాలుగేళ్లుగా కుటుంబంతో కలిసి నల్గొండలో నివసిస్తున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఆర్డీఓ, ఎస్పీ, తహశీల్దార్, స్థానిక పోలీసు అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి తదితరులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపారు.
భూమికి సంబంధించి సర్వే నిర్వహిస్తామని 2025 ఏప్రిల్ 3న, 2026 మే 11న నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి సర్వే జరగలేదని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన సర్వేయర్ పేరుకే సర్వే చేసి, ఎలాంటి అధికారిక నివేదిక ఇవ్వకుండా వెళ్లిపోయారని, పలుమార్లు కోరినా సర్వే నివేదిక అందించలేదని తెలిపారు.
రాజకీయ అండదండలతో కొందరు అధికారులు పేద రైతుల భూములను బలవంతంగా ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన మల్లయ్య, హైకోర్టు తీర్పు, జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తన పట్టా భూమిలో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి