కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్
కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్
Editor Desk
నిజామాబాద్,: రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శకం ముగిసిందని, ప్రజలు ఆయన గురించి ఆలోచించడం కూడా మానేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న పాలన పూర్తిగా అదుపు తప్పిందని విమర్శించారు. అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదని, మంత్రుల అధిక కమిషన్ల డిమాండ్లే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రజలు ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
రూ.8 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు అర్వింద్ తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సైదిరెడ్డి, దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి