కన్నకూతురిపై కన్నేసిన మృగానికి ఏడేళ్ల జైలు శిక్ష
కన్నకూతురిపై కన్నేసిన మృగానికి ఏడేళ్ల జైలు శిక్ష
NM Yadav
నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు..
నిందితుడికి రూ. 4 వేల జరిమానా..
బాధిత బాలికకు రూ. 2 లక్షల పరిహారం..
నల్లగొండ : రక్షణగా నిలవాల్సిన తండ్రే మృగంగా మారి, కన్నకూతురుతో సమానమైన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటనలో నల్లగొండ పోక్సో కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మైనర్లపై అకృత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తూ నిందితుడు ఉప్పుతల దుర్గాప్రసాద్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఘటన నేపథ్యం ఇదీ..
నార్కట్పల్లి మండలం కొండపాకొనిగూడెం గ్రామంలో 2018 ఏప్రిల్ 20న ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు దుర్గాప్రసాద్ తన 14 ఏళ్ల సవతి కుమార్తెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పారిపోగా బాలిక ప్రాణభయంతో ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు (ఏప్రిల్ 21, 2018) బాధితురాలు తన తల్లితో కలిసి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు దుర్గాప్రసాద్ ను దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 4,000 జరిమానా విధించింది. ఈ ఘటనతో మానసిక వేదనకు గురైన బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కేసు దర్యాప్తులో అప్పటి ఎస్హెచ్ఓ కె. గోవర్ధన్, ప్రస్తుత ఎస్హెచ్ఓ విష్ణు, కోర్టు విధులు నిర్వహించిన సీడీవోలు నరసింహ, కిరణ్, మరియు భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పనలు సమన్వయంతో వ్యవహరించి సాక్ష్యాలను పక్కాగా కోర్టు ముందు ఉంచారు. నేరస్తులకు శిక్ష పడటం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి