కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మయం: రాకేష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మయం: రాకేష్ రెడ్డి
Editor Desk
10న మోదీ సభకు భారీగా తరలిరండి – బీజేపీ పిలుపు
భువనగిరి,
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, రైతులు, యువత, మహిళలను మోసం చేశాయని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం చేసి రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రైతుబంధు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తోందని, అది ‘ఎన్నికల బంధు’గా మారిందని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని, తెలంగాణలో కూడా త్వరలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, తుమ్మల మురళీధర్ రెడ్డి, మాయ దశరథ, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి