జనాభా ఫార్ములా వద్దు… జీఎస్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి: గుత్తా
జనాభా ఫార్ములా వద్దు… జీఎస్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి: గుత్తా
Editor Desk
హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంపు విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు.
జనాభాతో పాటు జీఎస్టీ వాటాను కూడా పరిగణనలోకి తీసుకొని 50:50 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు చేయాలని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను వేరువేరుగా తీసుకురావాలని రాష్ట్రాల అభిప్రాయం ఉందన్నారు.
జమిలీ ఎన్నికల అంశంపై మాట్లాడుతూ, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం కష్టమని, 18 రాష్ట్రాలు ఒకసారి, మిగతా రాష్ట్రాలు మరోసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని, డబ్బు ప్రవాహాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో సాధారణ వ్యక్తి రాజకీయాల్లో పోటీ చేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీలో అసంతృప్తి సహజమని, బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మారుస్తారనే ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరుమార్పుపై ఆత్మపరిశీలన అవసరమని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడుతూ సమస్యలు తీరినట్లు తెలిపారు. సన్నధాన్యం సేకరణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, సీఎంఆర్ ధాన్యం సేకరణలో పూర్తి నియంత్రణ అవసరమని అన్నారు. మిల్లులను మూసివేయించే పరిస్థితి లేదని, అవి బంద్ అయితే కొనుగోళ్లు నిలిచిపోతాయని హెచ్చరించారు. కేంద్రం 20% బాయిల్డ్ రైస్, 80% రా రైస్ కోరుతుండగా, మిల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్కే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వేసవిలో రా రైస్ సేకరిస్తే నూక శాతం పెరుగుతుందని వివరించారు.
సాగునీటి అంశంపై మాట్లాడుతూ, ఏఎమ్మార్పీ కింద 4000 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా ప్రస్తుతం 2400 క్యూసెక్కులకు మించి రావడం లేదన్నారు. కాలువల విస్తరణతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి