గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి సుశృత 9వ వార్షికోత్సవంలో డిమాండ్
Editor Desk
భువనగిరి, యాదాద్రి జిల్లా: సుశృత గ్రామీణ వైద్యుల యాదాద్రి భువనగిరి జిల్లా 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి Y. S. రాజశేఖర రెడ్డి హయాంలో జీవో 428 ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 30 వేల మంది గ్రామీణ వైద్యులకు శిక్షణ అందించారని గుర్తుచేశారు. మరో 20 వేల మందికి శిక్షణ ఇవ్వకముందే ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న N. కిరణ్ కుమార్ రెడ్డి శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం K. చంద్రశేఖర్ రావు జీవో 429 ద్వారా శిక్షణ ఇస్తామని ప్రకటించినా అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వేధింపులకు గురిచేస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి శిక్షణ పూర్తి చేసిన వారికి గుర్తింపు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ వైద్యులపై ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హనుమంతరావు, రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు అంబటి చెన్నకృష్ణయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ నారాయణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలు, మండలాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి