గంజాయి విక్రయిస్తున్న ముఠా ముగ్గురు నిందితుల అరెస్ట్ రౌడీషీటర్ పరారీ..
గంజాయి విక్రయిస్తున్న ముఠా ముగ్గురు నిందితుల అరెస్ట్ రౌడీషీటర్ పరారీ..
NM Yadav
300 గ్రాముల గంజాయి, రెండు బైకులు స్వాధీనం..
వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి..
నల్లగొండ : పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి సేవిస్తూ ఇతరులకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, రెండు పల్సర్ బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
తనిఖీల్లో దొరికిపోయారు..
తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. శనివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని నమ్మదగిన సమాచారం అందడంతో రెండో పట్టణ ఎస్.ఐ వై. సైదులు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్జీ కళాశాల సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రెండు బైకులపై ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకోగా రౌడీషీటర్ బంటు కార్తీక్ పరారయ్యాడు.
చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయం..
అదుపులోకి తీసుకున్న మహమ్మద్ అబ్దుల్ నయీమ్ @ ముజీబ్, మహమ్మద్ సోహెల్, షేక్ లతీఫ్లను విచారించగా పరారిలో ఉన్న బంటు కార్తీక్ ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి వీరికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గంజాయిని సేవించడమే కాకుండా, పట్టణంలోని యువతను లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ను రూ. 500లకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఒకరైన అబ్దుల్ నయీమ్పై గతంలో హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదై ఉందని, పరారీలో ఉన్న కార్తీక్పై స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉందని డీఎస్పీ తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు
పట్టుబడిన ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని, పరారీలో ఉన్న రౌడీషీటర్ కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ సైదులు, కానిస్టేబుళ్లు బాలకోటి, షకీల్లను జిల్లా ఎస్పీ అభినందించారు. పట్టణంలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ శివరాం రెడ్డి ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి