ఈ-పంట నమోదులో పురోగతి.. జగన్ ఆరోపణలు నిరాధారం: అచ్చెన్నాయుడు
ఈ-పంట నమోదులో పురోగతి.. జగన్ ఆరోపణలు నిరాధారం: అచ్చెన్నాయుడు
Editor Desk
అమరావతి, జులై 3: ఈ-పంట నమోదుపై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వం ఈ-పంట నమోదులో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. సాక్షి పత్రికలో వస్తున్న కథనాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.
ఖరీఫ్-2024లో 41.87 లక్షల మంది రైతుల 96.78 లక్షల ఎకరాలు నమోదు కాగా, ఖరీఫ్-2025లో 53.32 లక్షల మంది రైతుల 117.39 లక్షల ఎకరాలు నమోదు చేశామని వెల్లడించారు. ల్యాండ్ పార్సిల్స్ నమోదు కూడా 106.38 లక్షల నుంచి 198.93 లక్షలకు పెరిగిందన్నారు. రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని చెప్పారు.
ఖరీఫ్-2026లో APAIMS 2.0 ద్వారా జియో-రెఫరెన్సింగ్, కృత్రిమ మేధ (AI), ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా డిజిటల్ పంట నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం, ఎస్ఎంఎస్ సమాచారం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగు జరిగినప్పటికీ, 30 రోజుల వయస్సు దాటిన పంటలనే ఈ-పంటలో నమోదు చేస్తామని వివరించారు. ఇప్పటివరకు 1.62 లక్షల మంది రైతులకు చెందిన 4.03 లక్షల ఎకరాల నమోదు పూర్తయిందన్నారు. రైతులకు సబ్సిడీలు, బీమా, పెట్టుబడి సాయం పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కొబ్బరి ధరలపై తప్పుడు ప్రచారం: మంత్రి
కొబ్బరి ధరలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత రెండేళ్లుగా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం కూడా బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రాకు రూ.15 వేల నుంచి రూ.24 వేల వరకు ధర ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు కథనాలతో మార్కెట్ను ప్రభావితం చేయాలని చూడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను మానుకోవాలని మంత్రి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి