గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు..
గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్టు..
NM Yadav
ఏఓబీ నుంచి నల్లగొండకు అక్రమంగా గంజాయి రవాణా..
5 కిలోల గంజాయి, 2 బైకులు, 5 సెల్ఫోన్లు స్వాధీనం..
మరో ఆరుగురు నిందితుల కోసం గాలింపు..
వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేశ్..
నల్లగొండ : జిల్లాలో గంజాయి విక్రయాలే ధ్యేయంగా సాగుతున్న ముఠా ఆట కట్టించారు నల్లగొండ పోలీసులు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) నుంచి అక్రమంగా గంజాయిని తరలించి స్థానికంగా విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే 5 కిలోల గంజాయితో పాటు, రెండు ఖరీదైన మోటార్ సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం ఆస్తి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అడిషనల్ ఎస్పీ రమేశ్ వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఉడిపి హోటల్ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో టూటౌన్ ఎస్సై వై. సైదులు తన సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుర్గా వైన్స్ సమీపంలోని సందులో రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా గంజాయి స్మగ్లింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దొంగతనం చేసిన బైకుపైనే స్మగ్లింగ్..
ముఠాలో ప్రధాన నిందితుడైన కోరేపల్లి అభినవ్ (A-1) చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాల కోసం డబ్బులు అవసరమై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. వారం క్రితం తన స్నేహితుడు మధుకుమార్తో కలిసి విజయవాడ ఇబ్రహీంపట్నంలో దొంగిలించిన పల్సర్ 220 బైకుపై ఏఓబీలోని సీలేరుకు వెళ్లారు. అక్కడ కిలో రూ. 3 వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి నల్లగొండకు తీసుకువచ్చారు. దాన్ని స్థానికంగా ఉన్న పలువురు నిందితులకు కిలో చొప్పున విక్రయించారు. మిగిలిన గంజాయిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో కోరేపల్లి అభినవ్, సింగపంగా రాకేశ్, మల్లె మోహన్ కృష్ణ (భద్రాచలం), ధరావత్ రాజేశ్ (కొత్తగూడెం), బత్తుల శివసాయి ఉన్నారు. వీరితో పాటు కస్పారాజు నాగరాజు, గంటెకంపు మధుకుమార్ సహా మరో ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇప్పటికే విజయవాడలో ఒక దొంగతనం కేసులో పోలీసులకు కావాల్సిన వ్యక్తిగా గుర్తించారు.
ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఎస్పీ..
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి విక్రయించే వారే కాకుండా, సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు, బాలకోటి, షకీల్, మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి