విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత
విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధం: మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ : విద్యే సమాజ అభివృద్ధికి బలమైన ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సవిత పేర్కొన్నారు. లలిత కళ పరిషత్ లో కురుబ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించిన మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించే సామర్థ్యం ప్రతి విద్యార్థిలో ఉందన్నారు. విద్యార్థులు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి విద్యపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్య వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే “తల్లికి వందనం”, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు.
అనంతరం SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 950కు పైగా మార్కులు సాధించిన 12 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున, పదో తరగతిలో 580కు పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా 508 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి